Raadha (రాధ )
ఎప్పటి లాగే ఆ రోజు, రఘు తెల్లవారే నిద్ర లేచి తన స్నేహితులతో వ్యాయామం చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న పరంధామయ్య గారు, రారా రఘు నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వలా వ్యాయామం చెయ్యడానికి వెళ్ళావో లేదో ఒక అమ్మాయి నీ కోసం మన ఇంటికి వచ్చింది. తన పేరు రాధ అని చెప్పింది. ఆ పేరు వినటం తోనే ఒక్కసారిగా రఘు మొహం అంత చెమటలతో నిండి పోయింది. రాధ ఎక్కడ ఉంది నాన్నా అని అడిగిన తన కొడుకు గొంతు లో ఏదో తెలియని తడబాటు పరంధామయ్య గారు గ్రహించలేక పోలేదు.
అదిగో అక్కడ వరండా లో కూర్చుని ఉంది అన్న పరంధామయ్య మాటలతో, రఘు చూపు ఒక్కసారిగా వరండా లో ఉన్న రాధ వైపు మల్లింది. రాధ, రెండు చిన్న జడలతో, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని అచ్చం అమ్మవారి లాగా ఉంది (అప్పటికి రాధ వయసు ఇంచుమించుగా పది సంవత్సరాలు ఉంటుంది). రఘుని చూడగానే, రాధ కళ్ళలో ఒక రకమైన ఆనందం, వెంటనే రఘు వద్దకి వెళ్లి అయ్యగారు అని ఏడవటం మొదలు పెట్టింది. రాధ ఏడవటం తో కంగుతున్న రఘు, ఏమైంది రాధ, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరన్నా ఎమన్నా అన్నారా, అయినా ఒక్క దానివే ఇక్కడికి ఎలా వచ్చావు, ఏడవకమ్మా, నేను ఉన్నాను కదా. ముందు వచ్చి ఇలా కూర్చో.
బయట జరుగుతున్న ఈ మాటలు వినపడి, వంట గదిలో ఉన్న జానకి (రఘు భార్య) బయటకు వచ్చింది. రాధ ఏడవటం చూసి, ఎవరండీ ఈ అమ్మాయి, ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంది. అక్కడే ఉన్న పరంధామయ్య, నేను ఇందాకటి నుంచి ఎవరమ్మా అని అడుగుతుంటె, మౌనం గా ఉందమ్మా, కానీ రఘు ని చూడగానే ఒక్కసారిగా ఏడవటం మొదలు పెట్టింది అని అంటారు. ఏరా రఘు, ఇంత జరుగుతున్నా మాట్లాడవేరా, అసలు ఎవరు ఈ అమ్మాయి అని నిలదీస్తాడు.
రఘు: నాన్న ఈ అమ్మాయి పేరు రాధ, నేను కాకినాడ లో నేను టీచర్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, మా హాస్టల్ లో పనిచేసే రంగన్న మనమరాలు. రంగన్న కి రాధ తప్ప ఎవరూ లేరు, నేను అప్పుడప్పుడు కాస్త డబ్బు సాయం చేసేవాడిని. రాధ ఇక్కడికి ఎందుకు వచ్చిందో, ఎందుకు ఏడుస్తుందో నాకేమి అర్ధం కావటం లేదు నాన్నా, జానకి ముందు రాధని ఇంట్లోకి తీసుకువెళ్లి కాస్త మంచి నీరు ఇవ్వు. తన కుదురుకున్నాక అసలు ఏమి జరిగిందో నెమ్మది గా అడిగి తెలుసుకుందాం.
జానకి: అలాగే అండి, రాధ ఇలా రా అమ్మ, ముందు కాస్త ఎంగిలి పడు, ఎప్పుడు తిన్నావో ఏమో అని లోపలకి తీసుకువెళ్తుంది.
సమయం సాయంత్రం ఏడు గంటలు అవుతుంది. పరంధామయ్య గారి ఇంట్లో పెందరాడే భోజనం చేసే అలవాటు ఉంది. జానకి భోజనం సిద్ధం చేసి అందరినీ పిలుస్తుంది. పరంధామయ్య భోజనం చేసే గదికి వచ్చి కూర్చుంటారు. ఎంతసేపటికీ రఘు, మరియు రాధ రాకపోవటంతో, పరంధామయ్య, జానకి తో అమ్మా జానకి రఘు ఇంట్లో లేడా అని అడుగుతాడు.
జానకి: ఉన్నారు మామయ్య గారు, మధ్యాహ్నం కూడా ఆయన భోజనం చెయ్యలేదు, ఏదో పరధ్యానం లో ఉన్నారు.
పరంధామయ్య : మరి ఆ అమ్మాయి రాధ భోజనం చేసిందా.
జానకి: ఉదయం కాస్త ఎంగిలి పడింది మామయ్య, కానీ ఏడుస్తూనే ఉంది అని చెప్తుంది.
పరంధామయ్య: ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు ఏడుస్తుందో విషయం ఎమన్నా కనుక్కున్నవా జానకి
జానకి: మీ అబ్బాయి గారిని అడగటానికి ప్రయత్నించాను మామయ్య గారు, కానీ ఆయన నుంచి ఎటువంటి జవాబు రాలేదు.
పరంధామయ్య: మరి రాధను అడగలేక పోయావా.
జానకి: అడిగి చూసాను మామయ్య, కానీ తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు. సరే కాస్త కుదుట పడ్డాక అడుగుదాం అని అనుకుంటున్నాను.
పరంధామయ్య: సరే నేను వెళ్లి రఘు ని తీసుకువస్తాను, నువ్వు వెళ్లి రాధని భోజనానికి తీసుకునిరా, భోజనం చేసాక నెమ్మదిగా అడిగి తెలుసుకుందాం.
రాధ భోజనం చేసి తన గదిలో ఒక్కటే తన అమ్మ మరియు తాతతో దిగిన ఫోటో చూస్తూ ఉంటుంది.
Comments
Post a Comment